
బ్రిటన్లో చిరంజీవికి అరుదైన గౌరవం
బ్రిటన్ పార్లమెంట్లో జీవిత సాఫల్య పురస్కారంతో సత్కారం
ఈ నెల 19న చిరుకు అవార్డును అందజేయనున్నట్లు ప్రకటన
సినీ రంగంలో చిరంజీవి అందిస్తున్న సేవలకు గాను ఈ అవార్డు
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించింది. నాలుగు దశాబ్దాలకు పైగా సినీ రంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ చిరంజీవి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించనున్నట్లు తెలిపింది. మార్చి 19న యూకే పార్లమెంటు (హౌస్ ఆఫ్ కామన్స్)లో ఈ అవార్డును చిరుకు అందజేయనున్నట్లు పేర్కొంది.
యూకేకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవిని మార్చి 19న సన్మానించనున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్ మన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ… సినిమా, ప్రజాసేవ, దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేయనున్నారు.
ఇక బ్రిడ్జ్ ఇండియా అనేది యూకేలో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీని రూపొందించడానికి పనిచేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు, వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో వారిని సత్కరిస్తుంది. కాగా, బ్రిడ్జ్ ఇండియా సంస్థ జీవిత సాఫల్య పురస్కారాన్ని తొలిసారిగా అందజేస్తోంది. దాన్ని చిరంజీవి అందుకోనుండటం విశేషం. ఇది ఆయన కీర్తి కీరటంలో మరో కలికితురాయిగా నిలుస్తుంది.
బ్రిటన్కు చెందిన పార్లమెంట్ సభ్యులు, బ్రిడ్జ్ ఇండియా వంటి ప్రఖ్యాత సంస్థ అంతర్జాతీయ వేదికపై చిరంజీని సన్మానించటం, ఆయనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇవ్వడం అనేది ప్రత్యేకమైన సందర్భం.
2024లో భారత ప్రభుత్వం నుంచి రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ను చిరంజీవి అందుకున్నారు. అలాగే గతేడాది అత్యంత సమర్ధవంతమైన నటుడు, డ్యాన్సర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో కూడా చోటు సంపాదించారు. ఏ.ఎన్.ఆర్ శత జయంతి సందర్భంగా అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎ.ఎన్.ఆర్ జాతీయ అవార్డును సైతం ప్రదానం చేసింది.
