
కియాలో 900 కారు ఇంజిన్ల చోరీ కేసులో పురోగతి.. 9 మంది అరెస్ట్
శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలోని యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా పరిశ్రమలో సుమారు 900 కార్ల ఇంజిన్లు మాయమయ్యాయి. దీనిపై కియా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. ప్రభుత్వం ఈ కేసును సీరియస్గా తీసుకుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తుంది.
అన్ని కోణాల్లో విచారిస్తున్న సిట్ బృందం.. తమిళనాడులో 9మందిని అరెస్ట్ చేసింది. వారు సంస్థలో పనిచేస్తున్నవారా..? మాజీ ఉద్యోగులా లేదా బయటివారా అన్నది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.
కియా కార్ల ఇంజిన్లు విదేశాల నుంచి చెన్నై పోర్టుకు చేరుకుంటాయి. పోర్ట్ నుంచి కంటైనర్ల ద్వారా ఏపీలోని కియా పరిశ్రమకు చేరుకుంటాయి. దారి మధ్యలో మాయం చేశారా?. ఇన్వాయిస్లో తేడాలు చూపి.. పోర్టు నుంచి ఇంజిన్లు తప్పించారా అన్న అంశాలపై కూడా క్లారిటీ రావాలి.
పెనుకొండ మండలం యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా కార్ల పరిశ్రమలో సుమారు 900 ఇంజిన్లు మాయమయ్యాయి. కియాలో జరిగిన ఈ భారీచోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మార్చి 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది కియా యాజమాన్యం. కియా ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేశాకే ఎంక్వయిరీ స్టార్ట్చేశారు పోలీసులు. వాటిని ఎక్కడికి తరలించి ఎలా సొమ్ముచేసుకుని ఉంటారనేది మరో అంతుపట్టని రహస్యం. తాజాగా ఈ కేసులో 9 మంది అరెస్ట్ కావడంతో.. త్వరలో చిక్కుముడి వీడే అవకాశం కనిపిస్తోంది.
