TEJA NEWS

వనపర్తిలో చాలా ఏళ్లుగా రోడ్ల పక్కన చెప్పులు కుట్టే వృత్తి(చర్మకార)పై జీవిస్తున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏఐటియూసీ సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ కోరారు. సిపిఐ కార్యాలయంలో స్నేహ ఫుట్పాత్ వర్కర్స్ సెంటర్ లో చెప్పులు కుట్టే కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు గోపాలకృష్ణ రమేష్ లు మాట్లాడారు. పట్టణం లోని రాజీవ్ చౌక్, మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, గాంధీ చౌక్, కొత్త బస్టాండ్ తదితర ప్రాంతాల్లో రోడ్ల పక్కన ఎండవానకు కష్టాలు పడుతూ చెప్పులు కుడుతూ జీవిస్తున్నారన్నారు. ఒక్కొక్కరి దినసరి ఆదాయం రూ. వంద కూడా మించటం లేదన్నారు. చాలీచాలని ఆదాయంతో దుర్భర జీవితం గడుపుతున్నారని ఆదుకోవలసిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉందన్నారు. పనిముట్లు, ముడి సరుకు ( చర్మం, లెదర్ ) బ్యాంకుల నుంచి రుణం, నీడ కోసం షెడ్లు ఇవ్వాలన్నారు. చెప్పులు కుట్టే పని వల్ల త్వరగా రోగాల బారిన పడుతున్నారని, ప్రత్యేక వైద్య వసతి కల్పించాలన్నారు. ఎక్కువమంది కార్మికులకు ఉండడానికి ఇండ్లు లేవని వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నారు.చాలామందికి ఆసరా పింఛన్లు కూడా లేవన్నారు. ప్రతి ఒక్కరికి నెలకు రూ.6వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వివిధ రకాల చెప్పుల కంపెనీలు మార్కెట్లోకి రావడంతో వారి వృత్తి పూర్తిగా దెబ్బతిన్నదని ఆదుకోవటం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి రమేష్, నాయకులు శాంతన్న, నజీర్, వెంకటేశ్వర్లు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS