
జేఈఈ మెయిన్ పరీక్ష ఫలితాలు
హైదరాబాద్:
జేఈఈ మెయిన్ 2025 తుది విడత ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ, గురువారం విడుదల చేయనుంది.
ఈ ఏడాది జనవరిలో జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జరుగగా.. ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు తుది విడత పరీక్షలు జరిగాయి. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్-1 (బీఈ/ బీటెక్) పరీక్షలు, ఏప్రిల్ 9వ తేదీన పేపర్-2ఏ, 2బీ (బీఆర్క్/బీ ప్లానింగ్) ప్రవేశ పరీక్షలు జరిగాయి.
అయితే ఈ రెండు విడతల పరీక్షల్లోని ఉత్తమ స్కోర్ను పరిగణనలోకి తీసుకొని విద్యార్ధులకు ర్యాంకులు కేటాయిస్తారు. జేఈఈ మెయిన్ 2025 సెషన్ 2 పరీక్షల ప్రాథమిక ఆన్సర్ కీ పై అభ్యంతరాల సమర్పణ గడువు ఆదివారం అర్ధరాత్రితో ముగిసింది.
అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలించి తుది ఆన్సర్ కీ తోపాటు ర్యాంకులను కూడా ఈ రోజు వెల్లడించనున్నారు. కేటగిరీల వారీగా కటాఫ్ స్కోర్ నిర్ణయించి ర్యాంకులు ప్రకటిస్తారు.
కటాఫ్ మార్కులు జనరల్ కేటగిరీకి 93 నుంచి 95 శాతం, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు 91 నుంచి 93 శాతం, ఎస్సీ కేటగిరీకి 82 నుంచి 86 శాతం, ఎస్టీ కేటగిరీకి 73 నుంచి 80 శాతం వరకు ఉండే అవకాశం ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడు తున్నారు.
ఇక ఈ రోజు వెల్లడయ్యే తుది, మలి వితడతల్లో ఉత్తమ స్కోర్ సాధించిన మొత్తం 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించినట్లు ప్రకటిస్తారు. అంటే వారు మాత్రమే మే 18వ తేదీన జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులన్నమాట.
