ముందే చెప్పాం.. సాధించి చూపించాం..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇది మా కానుక
పన్నెండేళ్ల అభివృద్ధిని ప్రజలు స్వాగతించారు..
ప్రజల అభిమానానికి ఋణపడి ఉంటా..
కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు.. వారికి నా పాదాభివందనం..
బీఆర్ఎస్ కు ఓటేసిన ప్రజలకే ఈ విజయం అంకితం..
ప్రతి మున్సిపాలిటీని అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దుతాం..
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు
గత 12 సంవత్సరాలుగా పటాన్చెరు నియోజకవర్గంలో పరిధిలోని ప్రతి గ్రామం వార్డు డివిజన్ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లామని.. ఇందుకు అనుగుణంగానే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బి ఆర్ ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలైన గడ్డపోతారం గుమ్మడిదల జిన్నారం ఇంద్రేశం ఇస్నాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అమూల్యమైన ఓటేసి గెలిపించిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను పటాన్ చెరు నియోజకవర్గం ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో తమ తీర్పు తో గట్టి గుణపాఠం చెప్పారని తెలిపారు.
గత పదేండ్లలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గదర్శకత్వంలో..మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో నియోజకవర్గ వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించామని, నేటి ఫలితాలతో ప్రజలు బీఆర్ఎస్ అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతించారని రుజువైందన్నారు. పార్టీ గెలుపుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు.
గత రెండున్నర సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని, తాను స్వకష్టంతో సిఎస్ఆర్ నిధుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని వివరించారు.
తమను నమ్మి ఓటేసి ఘనవిజయాన్ని కట్టబెట్టిన ఐదు మున్సిపాలిటీల ప్రజానీకానికి.. కృషి చేసిన కార్యకర్తలకు ఋణపడి ఉంటామని అన్నారు.
ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐదు మున్సిపాలిటీల పరిధిలో ప్రజలకు కావలసిన అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా కొనసాగిస్తానని హామీ ఇచ్చారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
