చట్టాలపై విద్యార్థులకు పూర్తి అవగాహన రావాలి
** తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు
తిరుపతి: తిరుపతి జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల్లో, ప్రజల్లో చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు విస్తృత అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఇందులో భాగంగా తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆర్ట్స్ కాలేజీలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీఐలు, ఎస్ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొని, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, మహిళలపై జరిగే నేరాలు, సైబర్ నేరాల పెరుగుదల, వాటి నుండి రక్షణ చర్యలు, అత్యవసర సహాయ సేవల కోసం ‘డయల్ 112’ వినియోగ విధానం, గొలుసు లాగింపు (చైన్ స్నాచింగ్ ) వంటి వీధి నేరాల నివారణ పద్ధతులు, అలాగే చిన్నారుల భద్రతకు సంబంధించిన “గుడ్ టచ్ బ్యాడ్ టచ్” అంశాలపై సమగ్రంగా వివరించారు.
విద్యార్థులు చట్టాలపై అవగాహనతో పాటు అప్రమత్తత కలిగి ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి, సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని, మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే 112 కు కాల్ చేయడం ద్వారా తక్షణ సహాయం పొందవచ్చని అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో చట్టాల పట్ల గౌరవం, సామాజిక బాధ్యత, స్వీయ రక్షణ పట్ల చైతన్యం పెంపొందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ ఇలాంటి అవగాహన కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిరంతరం కొనసాగిస్తుందని పేర్కొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
