
రామగుండంలో తాగునీటి వసతుల మెరుగుదలకు శ్రీకారం…..
రూ.1.80 కోట్ల డి.ఐ పైప్లైన్ పనులకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శంకుస్థాపన…..
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం నగర ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో రూ.1 కోటి 80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న నూతన డి.ఐ (డక్టైల్ ఐరన్) పైప్లైన్ పనులకు రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ శంకుస్థాపన చేశారు.
రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో బి పవర్ హౌస్ నుంచి మజీద్ టర్నింగ్ వరకు ఉన్న పాత 500 ఎంఎం పైప్లైన్ను తొలగించి, దాని స్థానంలో నూతన 500 ఎంఎం డయా డి.ఐ పైప్లైన్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పనులు పూర్తయిన తర్వాత నగర ప్రజలకు మరింత మెరుగైన తాగునీటి సరఫరా అందుబాటులోకి రానుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ప్రజలకు నిరంతరాయంగా, నాణ్యమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పాతబడిన పైప్లైన్ల కారణంగా తలెత్తుతున్న లీకేజీలు, నీటి సరఫరా అంతరాయాలను నివారించేందుకు దశలవారీగా మౌలిక వసతులను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
నూతన డి.ఐ పైప్లైన్ ఏర్పాటు పూర్తయిన తర్వాత నీటి వృథా తగ్గడంతో పాటు నగరంలోని పలు ప్రాంతాలకు తాగునీరు సజావుగా అందుతుందని ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ రామగుండం నగర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
