
సింగరేణి అభివృద్ధి – కార్మికుల సంక్షేమమే లక్ష్యం
సమీక్ష సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: హైదరాబాద్,
సింగరేణి సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం, గనుల ప్రాంతాల అభివృద్ధి పనులు మరియు స్థానిక నియోజకవర్గాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ రావు తెలిపారు.
సింగరేణి పరిధిలోని శాసనసభ్యులతో కలిసి సోమవారం డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో హర్కర వేణుగోపాల్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సింగరేణి సంస్థ ప్రస్తుత పరిస్థితులు, ఉత్పత్తి లక్ష్యాలు, కార్మికుల సంక్షేమ పథకాలు, గనుల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ చర్యలు, ఉద్యోగుల సమస్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.
అలాగే సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, తాగునీటి సౌకర్యం, విద్య, వైద్య సేవలు, పారిశుధ్య వ్యవస్థ మెరుగుదలతో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాల కల్పనపై కూడా సమావేశంలో చర్చించినట్లు సమాచారం.
కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచనలు చేసినట్లు తెలిపారు.
సింగరేణి సంస్థ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కీలకమైన సంస్థగా నిలుస్తోందని, సంస్థ పురోగతితో పాటు కార్మికుల సంక్షేమం, గనుల ప్రాంతాల అభివృద్ధి కూడా సమానంగా కొనసాగాలని సమావేశంలో అభిప్రాయపడినట్లు పేర్కొన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, సింగరేణి పరిధిలోని ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
