
నిరుపేద మహిళలను సంఘటితం చేసి కొత్త స్వశక్తి సంఘాలు ఏర్పాటు చేయాలి…
–అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం, నిరుపేద మహిళలకు అవగాహన కల్పించి కొత్త స్వశక్తి సంఘాలను ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ ఆదేశించారు.
రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో మెప్మా ఆర్పీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆర్పీలు తమకు అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు.
కొత్త మహిళా సమాఖ్యల ఏర్పాటు చేయడంతో పాటు 65 సంవత్సరాలు పైబడిన వృద్ధ మహిళలతో కూడా స్వశక్తి సంఘాలు ఏర్పాటు చేయాలని కోరారు. మహిళల ఆర్థిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం కింద మొదటి విడత రూ.15 వేలు, రెండో విడత రూ.25 వేలు, మూడో విడత రూ.50 వేల రుణాలు సకాలంలో అందేలా చూడాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి వీధి వ్యాపారి ఈ పథకం ప్రయోజనాలు పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే సర్వే మ్యాపింగ్ ప్రక్రియను నిర్దేశిత గడువులో పూర్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, మెప్మా టీఎంసీ మౌనిక, సీఓలు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
