
జనగామ త్రిలింగ రాజరాజేశ్వరి ఆలయానికి తక్షణ మరమ్మతులు చేపట్టాలి….
— సీపీఐ నేత తొడుపునూరి రమేశ్ కుమార్…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: జనగామ,
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ జనగామలో ఉన్న పవిత్ర త్రిలింగ రాజరాజేశ్వరి ఆలయంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించి తక్షణ మరమ్మతులు చేపట్టాలని సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు తొడుపునూరి రమేశ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఆలయాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించిన ఆయన మాట్లాడుతూ, ఆలయం పైకప్పు నుంచి వర్షపు నీరు కారుతుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వర్షపు నీరు లోపలికి రాకుండా వెంటనే పైకప్పుకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.
ఇటీవల వీచిన గాలి దుమారానికి ఆలయ ప్రాంగణంలోని రేకుల పందిరి దెబ్బతినడంతో పాటు రేకులు ఊడిపోయాయని, పదిహేను రోజులు గడిచినా సంబంధిత అధికారులు స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. వెంటనే కొత్త రేకులు ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు.
ఆలయం చుట్టూ పనికిరాని మొక్కలు, పొదలు అధికంగా పెరగడంతో పాములు, విషపురుగులు సంచరిస్తున్నాయని, దీంతో భక్తులకు ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వాటిని తొలగించి ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందిని కేటాయించాలని కోరారు.
అలాగే ఆలయ అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను దేవాలయ కమిటీ సమర్థవంతంగా నిర్వహించాలని, మున్సిపల్ కార్పొరేషన్, సింగరేణి, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ఆలయంలో ఉన్న అన్ని సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని తొడుపునూరి రమేశ్ కుమార్ డిమాండ్ చేశారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
