
కోవూరుకు నారా లోకేష్. ఘనస్వాగతానికి సిద్ధమవుతున్న టీడీపీ నాయకులు.
ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్న లోకేష్
కూటమి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలి: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి, యువనేత నారా లోకేష్ కోవూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారని శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. నెల్లూరులోని వీపీఆర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ.. ఈ పర్యటనలో భాగంగా స్వర్గీయ నందమూరి తారకరామారావు కాంస్య విగ్రహాన్ని నారా లోకేష్ ఆవిష్కరిస్తారని వెల్లడించారు. అనంతరం ఉషోదయ డైరీ పార్లర్ ఆవరణలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే కోవూరు క్యాడర్ మీటింగ్లో పాల్గొని నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తారని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు.యువగళం పాదయాత్ర అనంతరం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా కోవూరుకు వస్తున్న నారా లోకేష్ కి ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో ఘనస్వాగతం పలకాలని శ్రేణులను ఆహ్వానించారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు-ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జిల్లా ఇన్ఛార్జి మంత్రి మహ్మద్ ఫరూఖ్ సమక్షంలో ఈ కార్యక్రమం వైభవంగా జరగనుందని ఎమ్మెల్యే తెలిపారు.త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నారా లోకేష్ కోవూరు పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతుందని ప్రశాంతి రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం నారా లోకేష్ గారి స్వాగత ర్యాలీ, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, క్యాడర్ మీటింగ్ సభా స్థలి ఏర్పాట్లను ఆమె క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. కార్యక్రమానికి తరలివచ్చే కార్యకర్తలకు, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, పార్కింగ్, ఇతర వసతులు పక్కాగా ఉండాలని అధికారులకు, స్థానిక నాయకులకు సూచనలు చేశారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
