యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి!
హైదరాబాద్:
సైనిక పాఠశాలల తరహాలో పోలీసుల పిల్లలకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలో తొలి స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఉదయం ప్రారంభించారు.
విద్యాసంస్థ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, పోలీస్ ఉన్నతాధి కారులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి స్కూల్ లో ఏర్పాట్లను పరిశీలించారు.
50శాతం సీట్లు పోలీసు పిల్లలకే..
ఈ స్కూల్ లో అమరులైన పోలీసుల పిల్లలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తరువాత సర్వీసులో ఉన్న కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ ల కుటుంబాల పిల్లలకు 50శాతం సీట్లు కేటాయించారు. మరో 50శాతం సీట్లు స్థానికులకు కేటాయించారు.
ఓపెన్ కేటగిరీ విధానంలో సీట్లు అందుబాటులో ఉంటాయి. 1 నుంచి 5 తరగతుల్లో అడ్మిషన్ల కోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (వైఐపీఎస్) వెబ్సైట్లో అప్లయ్ చేసుకోవచ్చు. ప్రతి క్లాసులో 40 సీట్లు ఉంటాయి. 5 తరగతుల్లో కలిపి మొత్తం 200 సీట్లు ఉంటాయి.
అందులో 100 సీట్లు పోలీసు సిబ్బంది పిల్లలకు ఉంటాయి. మిగతావి ఇతర పిల్లలకు కేటాయించారు.
సైనిక పాఠశాలల తరహాలో పోలీసుల పిల్లలకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యంగ్ ఇండియా పోలీసు స్కూల్ ప్రాజెక్టును తీసుకొచ్చింది. అంతర్జాతీయ ప్రమాణాల తో ఈ స్కూల్ లో విద్యా బోధన ఉంటుందని తెలుస్తోంది.
అయితే, ఈ స్కూల్ లో ఫీజులు రీజనబుల్ గా ఉంటాయి. అంతర్జాతీయ స్థాయి విద్య, సీబీఎస్సీ సిలబస్ ఉంటాయి. క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇస్తారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
