శైవక్షేత్రాల్లో ఉపవాసం ఉండే భక్తులకు ఉచితంగా

Spread the love

శైవక్షేత్రాల్లో ఉపవాసం ఉండే భక్తులకు ఉచితంగా పండ్లు, అల్పాహారం పంపిణీ చేయాలి: కొండా సురేఖ

పండుగ కోసం అన్ని శైవ క్షేతాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలన్న మంత్రి

భక్తులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని సూచన

ఆలయాల వద్ద మద్యం అమ్మకాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశం

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉపవాసం ఉండే భక్తులకు అన్ని శైవక్షేత్రాల్లో ఉచితంగా పండ్లు, అల్పాహారం పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. అన్ని శైవక్షేత్రాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సూచించారు. మహా శివరాత్రి ఏర్పాట్లపై దేవాదాయ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే వేములవాడ, కాళేశ్వరం, కీసర, ఏడుపాయలు, రామప్ప, మేళ్లచెరువు, పానగళ్లు, పాలకుర్తి, వేయిస్థంభాల గుడి, కాశీబుగ్గ శివాలయం, భద్రకాళి తదితర ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లపై చర్చించారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయాల వద్ద ఎక్కడా మద్యం అమ్మకాలు జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇందుకోసం ప్రత్యేకంగా గస్తీని ఏర్పాటు చేయాలన్నారు.

అన్ని ఆలయాలను సమన్వయం చేసుకోవడానికి హైదరాబాద్‌లో ఎండోమెంట్ కమిషనరేట్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోదావరి, ఇతర నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ఆలయాల్లో నదీ హారతి కార్యక్రమం చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించాలని, అందుకు జిల్లా కలెక్టర్లు, స్థానిక అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు.

You cannot copy content of this page

Scroll to Top