నామసంకీర్తనే ముక్తికి మార్గం
** శతావధాని ఉప్పలధడియం భరత్ శర్మ
తిరుపతి: కలియుగంలో నామసంకీర్తనమే భక్తులకు మోక్షదాయకమని… నగర సంకీర్తన చేయడం సనాతనధర్మ పరిరక్షణ మార్గమని శతావధాని, ప్రవచనకర్త ఉప్పలధడియం భరత్ శర్మ ఉద్బోధించారు.
గత ఒకటిన్నర సంవత్సర కాలంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్, బీజేపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని కళాకారులు, భక్తులు ప్రతిశనివారం ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో ఈ శనివారం ఉదయాన్నే తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి దేవాలయ మాడవీథులలో గోవిందనామ సంకీర్తనలను ఆలపిస్తూ నగరసంకీర్తన నిర్వహించారు. మహిళా భక్తులు భక్తి పారవశ్యంతో కోలాట నృత్యాలు చేస్తూ ఉండగా, విశేషసంఖ్యలో భక్తులు ఈ నగర సంకీర్తనలో పాల్గొన్నారు.
కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతికి చెందిన శతావధాని, ప్రవచనకర్త ఉప్పలధడియం భరత్ శర్మ హాజరై, నగరసంకీర్తన వైభవాన్ని తెలియజేసారు. కలియుగంలో మానవులు భగవంతుణ్ణి చేరడానికి సులభమైన మార్గం నామసంకీర్తనమే అని, సాక్షాత్తు శ్రీమహావిష్ణువు నారదునితో చెప్పిన వృత్తాంతాన్ని భక్తులకు కళ్ళకుకట్టినట్లు వివరించారు. అలాగే, యువత ఈ కార్యక్రమంలో అధికంగా పాల్గొనాలని, అందుకు స్ఫూర్తి బాల భక్తుడైన ప్రహ్లాదుడే అని శతావధాని భరత్ శర్మ వివరించారు. ఈ సందర్భంగా నగరసంకీర్తన కార్యక్రమాన్ని నిర్విరామంగా నడిపిస్తున్న రాయలసీమ రంగస్థలి నిర్వాహకులు, బిజెపి సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డిని, వారి కృషిని భరత్ శర్మ అభినందించారు. కార్యక్రమములో నగర సంకీర్తన మండల సభ్యులు వాసుదేవరెడ్డి, మునినాధ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కొండే చెంగారెడ్డి రెడ్డి, బాబు, శంభోల హరినాథ్, విగ్రహాల కళ్యాణి, పద్మావతి, అరుణ, కుమారి, ఉషారాణి, కల్పన, పార్వతి, జయమ్మ, కవిత, లత, మేకల గంగయ్య, మురళి, పొన్నాల జేజి రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెంకటాచలం తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
