శెట్టిపల్లి భూముల సమస్య త్వరలోనే పరిష్కారం
** భూ పరిశీలనలో తుడా చైర్మన్, వైస్ చైర్మన్
తిరుపతి: తిరుపతి అర్బన్ మండల పరిధిలోని శెట్టిపల్లి భూముల సమస్యలను త్వరలోనే పరిశీలించి పరిష్కరిస్తామని “తుడా” చైర్మన్ “డాలర్స్” దివాకర్ రెడ్డి హామీ ఇచ్చారు. శెట్టిపల్లి భూములను చైర్మన్ సి.దివాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎన్.మౌర్య తుడా, రెవెన్యూ అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న శెట్టిపల్లి భూముల సమస్య పరిష్కారానికి అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. గత 10 సంవత్సరాలుగా రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. రైతులకు, సైట్లు కొనుగోలు చేసిన వారికి ఎక్కడ ఇవ్వాలనే విషయాలపై చర్చిస్తున్నామని అన్నారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే సర్దుకుని ముందుకు వెళ్లేందుకు సహకరించాలని కోరారు. వేల కుటుంబాలు ఆధారపడి ఉన్న శెట్టిపల్లి భూములను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ప్రభుత్వం తరపున ఈ భూములను అభివృద్ధి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో త్వరగా రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించి, మహా నగరంగా తీర్చిదిద్దనున్నామని తెలిపారు. తుడా తరపున ఇంత త్వరగా అభివృద్ధి చేశారా అనేలా చేస్తామని అన్నారు. ఈ పరిశీలనలో తుడా సూపరింటెండెంట్ ఇంజినీర్ కృష్ణారెడ్డి, ఈఈ. రవీంద్ర, ప్లానింగ్ ఆఫీసర్ దేవికుమారి, తహసీల్దార్ భాగ్యలక్ష్మి , ఉద్యానవన శాఖాధికారి మాలతి, సర్వేయర్లు దేవానంద్, కోటేశ్వర రావు, పలువురు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
