రాయల చెరువు తెగడంపై ఎంపీ గురుమూర్తి ఆందోళన
** తక్షణ సహాయక చర్యలకు రూ.20 లక్షల ఎంపీ నిధులు
తిరుపతి: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం లోని కేవీబీపురం మండలం ఓలూరు రాయల చెరువు తెగిపోవడంతో పరిసర గ్రామాలైన కళత్తూరు, కలత్తూరు హరిజనవాడ, పాతపాలెం గ్రామాలు నీటిమునిగాయి. ఈ ఘటనపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు డిల్లీలో ఉన్న ఎంపీ విషయం తెలుసుకుని వెంటనే స్పందించారు. తిరుపతి జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు.
తగిన సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని కలెక్టర్కి సూచించారు.
అలాగే స్థానిక ఆర్డీవోతో కూడా ఎంపీ మాట్లాడి తక్షణ సహాయక చర్యలకు ఎంపీ నిధుల నుండి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.
పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు వెంటనే స్పందించి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశించారు. గ్రామాల్లో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందేలా చూడాలని సూచించారు.
నీటమునిగిన ప్రాంతాల్లో పరిశుభ్రత చర్యలు తీసుకుని అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ విపత్తు కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజలు భయపడకుండా అధికారుల సూచనలు పాటిస్తూ సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన సహాయం అందించేలా ఎంపీ గురుమూర్తి చర్యలు తీసుకుంటున్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
