మురికిపూడి గ్రామంలో కలెక్టర్ కృతిక శుక్లా సందర్శన…
చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి గ్రామంలో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ పథకంలో నడుస్తున్న గొర్రెల పెంపక ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సందర్శించారు.ఈ సందర్భంగా గొర్రెల పెంపకందారు ఉసర్తి విజయకుమారి మాట్లాడుతూ, 1.13 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపారు.అందులో 25 లక్షలు ప్రథమ విడత సబ్సిడీగా కేంద్ర ప్రభుత్వం నుంచి లభించగా, 50 లక్షలు బ్యాంకు రుణంగా పొందినట్లు వివరించారు.ప్రస్తుతం రెండేళ్లుగా ఐదు వందల నెల్లూరు బ్రౌన్ జాతి ఆడ గొర్రెలు, ఇరవై ఐదు మగ పోతులతో గొర్రెల పెంపకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పశుసంవర్ధక శాఖ సిబ్బంది నిరంతరం నట్టల నివారణామందులు, అన్ని రకాల టీకాలు సమయానికి వేస్తున్నారని తెలిపారు.గడ్డి కత్తిరించు యంత్రం (చాఫ్ కట్టర్) ఉపయోగించి గడ్డి తయారు చేసుకోవడంలో సౌలభ్యం కలుగుతోందని, గడ్డి సాగు కోసం ఒక ఎకరం భూమి ఉందని వివరించారు.ఈ సందర్భంగా జిల్లా మేజిస్ట్రేట్ కృతిక శుక్లా మాట్లాడుతూ, 2024-25 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి అనుమతి లభించిన పశు సంవర్ధక ప్రాజెక్టులను బ్యాంకు అధికారులు, లబ్ధిదారులతో సమన్వయం చేసుకుని వేగంగా పూర్తి చేయాలని పశు సంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
