యువగళం.. చరిత్రలో నిలిచిపోయే ఘట్టం
** రాష్ట్ర పార్టీ సంబరాల్లో “తుడ” చైర్మన్ డాలర్స్
తిరుపతి / అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ – విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మక ‘యువగళం’ పాదయాత్ర 3 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తో కలసి “తుడ” ఛైర్మన్ అండ్ టీడీపీ తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డాలర్స్ దివాకర్ రెడ్డి హాజరయ్యారు. యువగళం విజయవంతమై మూడేళ్లు పూర్తయిన శుభసందర్భాన్ని పురస్కరించుకుని, పార్టీ నాయకులు… కార్యకర్తల సమక్షంలో పల్లా శ్రీనివాస్ తో కలసి తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకుని, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ మాట్లాడుతూ “రాష్ట్ర ప్రజల గొంతుకగా మారిన “యువగళం” పాదయాత్ర నేటితో మూడేళ్లు పూర్తి చేసుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో యువతకు మరిన్ని అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులకు నాంది పలికిందని కొనియాడారు.
ముఖ్యంగా యువతలో చైతన్యం నింపడమే కాకుండా, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి యువగళం వేదికగా నిలిచిందని అన్నారు. ఆనాడు లోకేష్ వేసిన ప్రతి అడుగు నేటి ప్రజా ప్రభుత్వ స్థాపనకు పునాది అని పేర్కొన్నారు.
కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపిన యువగళం స్ఫూర్తితో రాబోయే రోజుల్లోనూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, యం ఎస్ రాజు, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మోహన్, యంఎల్సి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ శ్రీదేవి, టీడీపీ సీనియర్ నాయకులు, అనుబంధ సంఘాల నేతలు, తెలుగు యువత, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
