బాపుజీ మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం…
జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ.
అహింస, సత్యాగ్రహాలే ఆయుధాలుగా దేశానికి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను అందించేందుకు మహనీయుడు జాతిపిత మహాత్మాగాంధీ చేసిన శాంతియుక్త పోరాటం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని, ఆయన చూపిన మార్గంలో పయనించి గ్రామాల అభివృద్ధి రాష్ట్ర దేశాభివృద్ధిలో భాగస్వాములమవుదామని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీళ పిలుపునిచ్చారు.
జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా శుక్రవారం పెనుగంచిపోలులో జరిగిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ, స్థానిక శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) అధికారులతో కలిసి పూజ్య బాపూజీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతి సమగ్రత, సమైక్యతకు బాపూజీ అనుసరించిన శాంతియుక్త మార్గం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. అహింసాయుత మార్గంలో సత్యమే పరమావధిగా జీవించిన మహనీయుడు మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యానికి బాటలు వేశారని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు.
శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవితం అహింస, సత్యాగ్రహం, స్వదేశీ, సర్వోదయం వంటి సూత్రాలతో నిండినదని మహాత్ముని ఆదర్శాలు ఇప్పటికీ ప్రపంచానికి శాంతి, సమానత్వం మార్గాన్ని చూపుతున్నాయన్నారు. ఆయన మార్గమే దేశ భవిష్యత్తుకు శిరోధార్యంగా నిలుస్తోందన్నారు. శాంతి, సత్యాగ్రహాల మార్గంలో గాంధీజీ బ్రిటిష్ వారిని ఎదిరించి, ప్రజలను సంఘటితం చేసి స్వరాజ్యం సాధించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన అహింసా సిద్ధాంతం దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఎందరో పోరాట యోధులకు స్ఫూర్తినిచ్చిందని అన్నారు.
కార్యక్రమంలో నందిగామ ఆర్డీవో బాలకృష్ణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి హనుమంతరావు, డిఇవో చంద్రకళ, ఐసిడిఎస్ పిడి రుక్సాన సుల్తానా బేగం స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.
……………………………….
(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
