ఏపీ లిక్కర్ స్కాం: ఏ2 నిందితుడు వాసుదేవరెడ్డికి రిమాండ్
కుంభకోణంలో వాసుదేవరెడ్డిదే కీలకపాత్ర అని తేల్చిన సిట్
ఆన్లైన్ వ్యవస్థను మ్యాన్యువల్గా మార్చి స్కాంకు పాల్పడినట్లు నిర్ధారణ
అధికారులను, సిబ్బందిని సిండికేట్గా నడిపించారని ఆరోపణ
విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధింపు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో రెండో నిందితుడిగా (A2) ఉన్న వాసుదేవరెడ్డిని అధికారులు ఈరోజు అరెస్ట్ చేశారు. అనంతరం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి ఫిబ్రవరి 27 వరకు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వాసుదేవరెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
ఈ సందర్భంగా సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ మద్యం కుంభకోణంలో వాసుదేవరెడ్డి పాత్రే అత్యంత కీలకమని సిట్ నిర్ధారించింది. లభించిన సాంకేతిక ఆధారాలు, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులు, విచారించిన సాక్షుల వాంగ్మూలాలన్నీ వాసుదేవరెడ్డి ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నాయని రిపోర్టులో పేర్కొంది.
మద్యం అమ్మకాలు, కొనుగోళ్లు, ఆర్డర్లు, సరఫరా వరకు మొత్తం వ్యవహారాన్ని వాసుదేవరెడ్డి తన కనుసన్నల్లోనే నడిపారని సిట్ తెలిపింది. APSBCL కార్యకలాపాలు ఆన్లైన్లో ఉండగా, ఎలాంటి అనుమతులు లేకుండా వాటిని మ్యాన్యువల్గా మార్చడంలో ఆయన కీలకపాత్ర పోషించినట్లు తేలింది. ఈ కుంభకోణంలో ఒక సిండికేట్గా ఏర్పడి అధికారులు, సిబ్బందిని నడిపించారని, ఈ కేసులో A1గా ఉన్న రాజశేఖర్ రెడ్డి, అతని అనుచరుల ద్వారా సెటిల్మెంట్లు చేశారని సిట్ తన రిపోర్టులో వివరించింది.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
