వడదెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలి
వైద్య ఆరోగ్య సిబ్బంది సూచనలను పాటించండి
- డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని
వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. వైద్య ఆరోగ్య సిబ్బంది చేసిన సూచనలు పాటించాలని డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని సూచించారు. ఈ మేరకు బుధవారం ఆమె ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ వారి సూచనల మేరకు వేసవికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా తగిన ఏర్పాట్లు చేశామని.. ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచామన్నారు. స్వర్ణ గ్రామం, వార్డులోనూ, చలివేంద్రాల్లోనూ
ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచామని.. విద్యార్థులకు కూడా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జ్వరం, విరోచనాలు, వడదెబ్బ కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నట్లు తెలిపారు. వదులుగా ఉండే లేతరంగు కాటన్ దుస్తులు ధరించడం, ఎండ తీవ్రత బారినపడకుండా టోపీ వంటివి ధరించాలన్నారు. తరచు సురక్షితమైన తాగునీటిని తాగాలని.. పుచ్చకాయ వంటి నీరు శాతం ఎక్కువగా ఉండే పండ్లను తీసుకోవాలన్నారు. వయోవృద్ధులు, చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని సూచించారు.
(డీఐపీఆర్వో, ఐ అండ్ పీఆర్, ఎన్టీఆర్ జిల్లా వారి ద్వారా జారీ)

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
