అల్గాం గ్రామంలో గుడుంబా స్థావరాలపై పోలీస్–ఎక్సైజ్ శాఖల సంయుక్త దాడులు…
పెద్దపల్లి// రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధిలోని కోటపల్లి మండలం అల్గాం గ్రామంలో బుధవారం కోటపల్లి పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు.
గ్రామంలోని గుడుంబా ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికీ తనిఖీలు నిర్వహించి గుడుంబా తయారీ కేంద్రాలను గుర్తించి ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా దాదాపు 1500 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే పారబోశారు.అలాగే నలుగురు మహిళల వద్ద నుంచి 70 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ కృష్ణ తెలిపారు.
ఈ సందర్భంగా చెన్నూరు రూరల్ సీఐ కృష్ణ మాట్లాడుతూ గుడుంబా అనే మహమ్మారి కారణంగా అనేక మంది యువకులు వ్యసనపరులై ప్రాణాలు కోల్పోతున్నారని, దీని వల్ల అనేక కుటుంబాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.గ్రామంలో ఎవరైనా గుడుంబా తయారీ,విక్రయం లేదా దానికి అవసరమైన ముడి సరుకుల సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే నాటుసారా తయారీలో ఉపయోగించే పాత్రలు,డ్రమ్ముల విక్రయాలపై కూడా ప్రత్యేక నిఘా ఉంచుతామని స్పష్టం చేశారు.గ్రామాలను గుడుంబా రహితంగా తీర్చిదిద్దేందుకు గ్రామ సర్పంచ్లు ముందడుగు వేయాలని, గ్రామస్థుల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి గుడుంబా నిషేధ తీర్మానాలు చేయాలని సీఐ కోరారు.
ప్రజలందరూ పోలీసులకు సహకరించి గుడుంబా నిర్మూలనలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ దాడుల్లో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సీఐ సమ్మయ్య,కోటపల్లి ఎస్సై రాజశేఖర్, ఎక్సైజ్ ఎస్సై వెంకటరమణతో పాటు పోలీస్, ఎక్సైజ్ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
