
రావిపహాడ్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ – రాజ్యాధికారంలో జనాభా నిష్పత్తి కీలకం: ప్రొఫెసర్ కాసిం
మోతె మండలం రావిపహాడ్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రొఫెసర్ కాసిం సార్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, దేశంలో రాజ్యాధికారం జనాభా లెక్కల దామాషా ప్రకారం అందరికీ అందే విధంగా ఉండాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన అవసరం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
తెలంగాణలో ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందాలని, ముఖ్యంగా ఎస్సీల పరిస్థితి ఇప్పటికీ మారలేదని, “ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది” అన్నట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం వారి హక్కులను వారికి అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.
దళితులు క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ రిజర్వేషన్లు వర్తించవని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. మతం మారినా కులం మారదని, కాబట్టి విద్య, ఉద్యోగాలలో పోటీ పడేందుకు రిజర్వేషన్ కొనసాగించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజా యుద్ధనౌక ఏపూరి సోమన్న, పల్లె నర్సింహన్న , గ్రామ సర్పంచ్ కోడి లింగ యాదవ్ ABR చైతన్య యువజన సంఘం అధ్యక్షులు కంపాటి దిలీప్ కుమార్, పిడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు మాజీ సర్పంచ్ శ్యామలైటి కోటేష్,కిష్టయ్య, మాజీ ఎంపిటిసి పొడపంగి యలమంచి, సండ్ర మధు, స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
