
అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం.. జాప్యాన్ని సహించం….
పనులను సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు అదనపు కలెక్టర్ జె. అరుణ శ్రీ హెచ్చరిక….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం, నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు.
నగరంలో వివిధ పథకాల కింద కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఇంజినీరింగ్ విభాగం అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్లతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పనులు పూర్తయిన అనంతరం సైట్ను పూర్తిగా శుభ్రపరిచి ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పనులు ఆలస్యమవడం వల్ల ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉంటుందని, అందువల్ల అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. సరైన కారణం లేకుండా పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
అభివృద్ధి పనుల అమలులో అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
ఈ సమావేశంలో నగరపాలక సంస్థ ఏఈలు తేజస్విని, మనోజ్, అన్వేష్, టెక్నికల్ ఆఫీసర్ సౌమ్య, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
