ప్రతి అర్హుడి ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం…

Spread the love

ప్రతి అర్హుడి ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం…

ప్రత్యేక ఓటరు జాబితా సవరణను త్వరగా పూర్తి చేయాలి….

— తహసీల్దార్ పడాల వరప్రసాద్…

పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: పెద్దపల్లి, పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని అంతర్గాం తహసీల్దార్ పడాల వరప్రసాద్ పిలుపునిచ్చారు. మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి బూత్ స్థాయి అధికారులు, గ్రామ ప్రజలకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ పడాల వరప్రసాద్ మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం అత్యంత కీలకమైనదని అన్నారు. బూత్ స్థాయి అధికారులు అందజేసిన దరఖాస్తు పత్రాలను అర్హులైన ఓటర్లు పూర్తిగా నింపి వీలైనంత త్వరగా తిరిగి వారికి అందజేయాలని సూచించారు. దరఖాస్తుల విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత బూత్ స్థాయి అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదయ్యేలా బూత్ స్థాయి అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు దరఖాస్తుల నింపడంలో సహకరించాలని కోరారు.

ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడం, వివరాల్లో తప్పులు, చిరునామా మార్పులు, కొత్త ఓటర్ల నమోదు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రజలు కూడా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గిర్దావర్ గుంట రమేష్, గ్రామ పంచాయతీ అధికారి మర్రి శంకర్ స్వామి, బూత్ స్థాయి అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top