కబ్జాకు గురైన స్మశాన వాటిక భూమిని గ్రామానికి అప్పగించాలి: కలెక్టర్‌కు మురుమూరు గ్రామస్తుల వినతి….

Spread the love

కబ్జాకు గురైన స్మశాన వాటిక భూమిని గ్రామానికి అప్పగించాలి: కలెక్టర్‌కు మురుమూరు గ్రామస్తుల వినతి….

పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి:రామగుండం, మురుమూరు గ్రామ పంచాయతీ పరిధిలో స్మశాన వాటికకు కేటాయించిన భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుని తిరిగి గ్రామానికి అప్పగించాలని కోరుతూ గ్రామ పాలకవర్గం, ప్రజలు, యువకులు ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

గ్రామస్తుల వివరాల ప్రకారం, మురుమూరు గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 126లో స్మశాన వాటిక కోసం రెండు ఎకరాల భూమి కేటాయించగా, ప్రస్తుతం ఆ భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారని ఆరోపించారు. ఇది సాగు భూమి కాదని, గ్రామ అవసరాల కోసం కేటాయించిన స్మశాన వాటిక భూమి అని పేర్కొంటూ, ఆక్రమణలను వెంటనే తొలగించి గ్రామానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌తో పాటు పెద్దపల్లి ఆర్డీవోను కలిసి వినతిపత్రం అందజేసినట్లు గ్రామస్తులు తెలిపారు. స్మశాన వాటిక భూమిని పరిరక్షించి గ్రామ ప్రజలకు అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మురుమూరు గ్రామ ఉపసర్పంచ్ యాదండ్ల సుమన్, పాలకవర్గ సభ్యులు కొదురుపాక మహేందర్, లంక మధునయ్య, మగ్గిడి రమ్య–రమేష్, వడకపురం స్వప్న–తిరుపతి, మండల కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు మగ్గిడి రాకేష్‌తో పాటు గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top