
ములకలపల్లి కేజీబీవీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్, పీహెచ్సీలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే జారే
అశ్వారావుపేట :
ములకలపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ) సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ & కళాశాల, మరియు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పి హెచ్ సి) అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ముందుగా కేజీబీవీ ని సందర్శించిన ఎమ్మెల్యే విద్యార్థినులతో ముచ్చటించి, కాసేపు తరగతి గదిలో పాఠాలు బోధించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని చదువులో రాణించాలని సూచించారు. అనంతరం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో మెస్ ను పరిశీలించి, భోజన నాణ్యతపై ఆరా తీశారు. నిర్దేశిత మెనూ ప్రకారం పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందించాలని, నాణ్యతలో లోపాలు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
చివరగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పి హెచ్ సి) తనిఖీ చేసి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ విద్యా, వైద్య లక్ష్యాలను నీరుగార్చవద్దని అధికారులకు, యాజమాన్యానికి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి బత్తుల అంజి ,మాజీ సర్పంచ కారం సుధీర్ , సేవాదళ్ నాయకులు తిరపతి రెడ్డి , యూత్ కాంగ్రెస్ నాయకులు సుమిత్ , వంశీ , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
