
మహిళలు, విద్యార్థుల భద్రతకు షీ టీమ్ అండ
వేధింపులకు గురైతే భయపడొద్దు.. షీ టీమ్కు సమాచారం ఇవ్వండి….
మహిళల భద్రత, సైబర్ మోసాలు, మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన…
పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి” గోదావరిఖని
మహిళలు, విద్యార్థుల భద్రతకు షీ టీమ్లు నిరంతరం అందుబాటులో ఉంటాయని షీ టీమ్ సభ్యులు తెలిపారు. రామగుండం సీపీ ఆదేశాల మేరకు, షీ టీమ్ ఇన్చార్జ్ ఎస్ఐ లావణ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి షీ టీమ్ సిబ్బంది గోదావరిఖని మార్కండేయ కాలనీలోని శ్రీచైతన్య డిగ్రీ కళాశాలలో బాలురకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీమ్ సభ్యురాలు స్నేహలత మాట్లాడుతూ విద్యార్థులు గుడ్ టచ్, బ్యాడ్ టచ్పై అవగాహన కలిగి ఉండాలని, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. బాలల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియా ప్రభావం, విద్యార్థుల ప్రవర్తన, మహిళల భద్రత, ఆన్లైన్ మోసాలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై వివరించారు.
మహిళల రక్షణ కోసం ప్రతిరోజూ బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, కళాశాలల వద్ద షీ టీమ్ నిఘా ఉంటుందని తెలిపారు. ఎవరైనా మహిళలు లేదా విద్యార్థులను వేధింపులకు గురిచేస్తే భయపడకుండా 6303923700 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
మహిళలకు ఏదైనా ప్రమాదం లేదా బెదిరింపులు ఎదురైతే వెంటనే 100/112కు డయల్ చేయాలని, ఆన్లైన్ మోసాలకు గురైతే 1930కు ఫోన్ చేయాలని సూచించారు. ప్రయాణ సమయంలో మహిళల భద్రత కోసం టీ-సేఫ్ యాప్ను వినియోగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఏకాంతం, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు మౌనిక తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
