
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి….
పెండింగ్లో ఉంచకుండా పరిష్కారం చూపాలి….
— జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, పెద్దపల్లి// : ప్రజల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రజావాణిలో అందిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా, నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కారం చూపాలని సూచించారు.
పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ శ్రీరాములుతో కలిసి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, సంబంధిత శాఖల అధికారులకు అర్జీలను పంపిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కమాన్పూర్ మండలం నాగారం గ్రామానికి చెందిన జి.స్వప్న తమ ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటూ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్న జి.రమేష్పై చర్యలు తీసుకోవాలని కోరగా, కమాన్పూర్ తహసీల్దార్కు అర్జీని పంపించి విచారణ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
పెద్దపల్లి పట్టణానికి చెందిన వడ్డేపల్లి చైతన్య తాను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీకాం పూర్తి చేశానని, ఉపాధి కల్పించాలని కోరగా, జిల్లా ఉపాధి అధికారికి దరఖాస్తును పంపించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అదేవిధంగా పెద్దపల్లి పట్టణానికి చెందిన షాహిదా తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని కోరగా, పీడీ హౌసింగ్కు అర్జీని పంపించి పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
పెద్దపల్లి పట్టణానికి చెందిన దుగ్గంపూడి శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలు సర్వే నంబర్ 58లోని భూమిపై హైకోర్టులో కేసు కొనసాగుతున్నందున అక్కడ అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్కు దరఖాస్తును పంపించి విచారణ చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
