దళిత స్పీకర్‌ను అవమానిస్తే సహించం.. తాతా మధును వెంటనే బహిష్కరించాలి.

Spread the love

దళిత స్పీకర్‌ను అవమానిస్తే సహించం.. తాతా మధును వెంటనే బహిష్కరించాలి….

కేసీఆర్ తీరు మార్చుకోవాలి.. తాతా మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలి…

— నరేష్ గొడిశల…

పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, హైదరాబాద్//
తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై బీఆర్‌ఎస్ నాయకుడు తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలంగాణ దళితుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు నరేష్ గొడిశల ఒక ప్రకటనలో తెలిపారు.

దళిత వర్గానికి చెందిన శాసనసభ స్పీకర్‌ను అవమానించే విధంగా తాతా మధు వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు కావాలనే చేశారని, దళిత స్పీకర్‌ను అవమానించేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన శ్రేణులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తాము భావిస్తున్నామని ఆరోపించారు.

తాతా మధుపై ప్రభుత్వం వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి తక్షణమే అరెస్టు చేయాలని నరేష్ డిమాండ్ చేశారు. కేసీఆర్ తన తీరు మార్చుకోవాలని, తాతా మధును బీఆర్‌ఎస్ పార్టీ నుంచి వెంటనే బహిష్కరించాలని కోరారు.

అంతేకాకుండా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న దళిత స్పీకర్‌ను అవమానించిన తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా తొలగించేలా చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్‌ను డిమాండ్ చేశారు. ఈ ఘటనపై బీఆర్‌ఎస్ పార్టీ స్పీకర్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అన్నారు.

దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని నరేష్ గొడిశల హెచ్చరించారు.

You cannot copy content of this page

Scroll to Top