ఎడ్లపాడులో దొంగలు హల్ చల్
వరసగా రెండు ఇళ్లలో చోరీ
విలువైన బంగారం, వెండి ఆభరణాలు, నగదు మాయం
ఘటన స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేపట్టిన యడ్లపాడు పోలీస్ లు
యడ్లపాడు ప్రజల్లో కలవరం రేపిన వరుస చోరీ లు
నగదు, బంగారం కోసం ఇల్లు మొత్తం క్ష్షుణ్ణం గా వెతికిన దొంగలు
ప్రొఫెషనల్ దొంగల పనేనన్న ఎడ్లపాడు SI
ఎడ్లపాడు గ్రామంలో అర్ధరాత్రి దొంగలు రెచ్చిపోయారు. రెండు ఇళ్లను లక్ష్యంగా చేసుకుని భారీగా చోరీ చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాధితుల వివరాలు, పోలీసుల ప్రాథమిక విచారణ ఆధారంగా ఈ ఘటన గురువారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో చోటుచేసుకున్నట్లు గుర్తించారు.
గ్రామానికి చెందిన నరవారి హనుమాన్ సింగ్ అనే గృహ యజమాని తన వృత్తి నిమిత్తం వాహన డ్రైవర్గా వెళ్లి అర్ధరాత్రి ఇంటికి చేరగా, తలుపు తాళం పగలగొట్టబడిన దృశ్యం కనిపించింది. లోపలికి వెళ్లి చూశాడో లేదో, ఇల్లు మొత్తం చిందరవందరంగా మారిన దృశ్యం చూసి చోరీ జరిగినట్టు అర్థమై పోలీసులు సమాచారం అందించాడు
బాధితుడు హనుమాన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ సభ్యులంతా పని నిమిత్తం ఊరికి వెళ్లిన నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలోనే ఈ దోపిడి జరిగిందని తెలిపాడు. ఈ చోరీలో ఇంట్లోనీ రూ.20 వేల నగదు, 50 తులాల వెండి ఆభరణాలు, 9 గ్రాముల బంగారు ఆభరణాలు, పిల్లల ఉంగరాలు, చెవి దిద్దులు వంటి విలువైన వస్తువులను అపహరించినట్లు గుర్తించినట్లు వెల్లడించాడు.
ఇక ఇదే సమయంలో ఇంటి ఎదురుగా ఉన్న దండ ప్రమీల ఇంట్లో కూడా దుండగులు చోరీ ప్రయత్నం చేసినట్టు సమాచారం. తాళం పగలగొట్టి లోపలకి వెళ్లినా, అక్కడ విలువైన వస్తువులు కనిపించకపోవడంతో దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ప్రమీల గ్రామంలో లేరు. కుటుంబ సభ్యులు ఫోన్ ద్వారా ఆమెను సంప్రదించి వివరాలు సేకరించారు.
సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలాలకు చేరుకుని క్లూస్టీమ్ సహాయంతో ఆధారాలను సేకరిస్తున్నారు.రెండు ఇళ్లలో ఒకే విధంగా తాళాలు పగలగొట్టిన విధానం చూసి ప్రొఫెషనల్ దుండగులు అయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
గ్రామంలో ఇటువంటి దొంగతనాలు పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రాత్రి సమయంలో గస్తీ పెంచాలని, విచారణను వేగవంతం చేసి దోషులను తక్షణమే పట్టుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
