
రైతు శ్రేయస్సే లక్ష్యంగా పని చేయాలి…
వ్యవసాయ శాఖ పని తీరు పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…
పెద్దపల్లి : వ్యవసాయ శాఖ అధికారులు రైతు శ్రేయస్సే లక్ష్యంగా పని చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో వ్యవసాయ శాఖ పని తీరు పై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, జిల్లాలో 79% ఫార్మర్ రిజిస్టరీ పూర్తి చేశామని, దీనిని 85% వరకు పూర్తి చేసే విధంగా ఎం.ఏ.ఓ, ఏ.ఈ.ఓ సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి రైతుల ఈ-కేవైసి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు.
రైతు బీమా పథకం అమలు పై వ్యవసాయ అధికారులు శ్రద్ద పెట్టి రైతు మరణించిన తర్వాత త్వరగా సంబంధిత దరఖాస్తు ఫార్వార్డ్ చేస్తూ కుటుంబానికి సహాయం అందేలా చూడాలని అన్నారు. రాబోయే వానాకాలం సీజన్ కు అవసరమైన యూరియా పంపిణీ సజావుగా జరిగేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ తెలిపారు.
వ్యవసాయ శాస్త్రవేత్తలతో కూడిన బృందాలు గ్రామాలలో పర్యటిస్తూ రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు నూతన సాగు పద్దతులు, భూ సారం పెంపుకు చర్యలు, పంట మార్పిడి విధానం పై అవగాహన కల్పించాలని, గ్రామాలలో పర్యటన సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల వివరాలు తెలియజేయాలని అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ తరపున సంపూర్ణ ఏర్పాట్లు పక్కాగా చేయాలని, రబీ సీజన్ సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రణాళిక ప్రకారం జరిగేలా చూడాలని, కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన ధాన్యం తీసుకుని వచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, మండల వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
