
కాంగ్రెస్ పాలనలో పేదల సొంతింటి కల సాకారం
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు.. మరో విడత మంజూరుకు సిద్ధం…..
— ప్రభుత్వ విప్ విజయరమణారావు…
పెద్దపల్లి- పెద్దపల్లి/ : పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
సుల్తానాబాద్ పట్టణంలోని 15వ వార్డు పూసాల, పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి, 27వ వార్డు సుభాష్నగర్, 25, 33వ వార్డుల్లో మున్సిపల్ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ప్రతి లబ్ధిదారుడికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తూ పేదల సొంతింటి కలను నెరవేరుస్తోందన్నారు.
పెద్దపల్లి పట్టణంలో నిర్మాణంలో ఉన్న సుమారు 370 ఇందిరమ్మ ఇళ్లు దసరా, దీపావళి నాటికి ప్రారంభానికి సిద్ధం కానున్నాయని వెల్లడించారు. మరో విడతలో కూడా అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి పేద కుటుంబానికి గూడు నీడ కల్పించాలన్నదే ఇందిరమ్మ ప్రభుత్వ ఆశయమని విజయరమణారావు పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
