TEJA NEWS

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పిడుగు హరిప్రసాద్ నామినేషన్

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

రాష్ట్ర సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ , జనసేన పార్టీ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్, శ్రీమతి లోకం మాధవి, బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, పత్సమట్ల ధర్మరాజు, గిడ్డి సత్యనారాయణ, వర ప్రసాద్ తదితరులు వెంట రాగా రిటర్నింగ్ అధికారి ఎమ్.విజయరాజుకు నామినేషన్ పత్రాలు అందజేశారు.

అనంతరం శాసనసభ ఆవరణలో పి.హరిప్రసాద్ మాట్లాడుతూ “పాత్రికేయుడిగా ప్రయాణం మొదలుపెట్టి ఇక్కడ వరకు రావడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉంది. ఇప్పటి వరకు పాత్రికేయుడిగా ఆ సమస్యల పరిష్కారానికి పరోక్షంగా కృషి చేశాను. ఇప్పుడు ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం లభించింది. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి, వారికి మేలు చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. నాకు
ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి రుణపడి ఉంటాను. పవన్ కళ్యాణ్ ప్రపోజల్ ను అంగీకరించి, నాకు ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు. అసభ్యతకు తావు లేకుండా సంస్కార వంతమైన చర్చ జరిగేలా కౌన్సిల్ లో తనవంతు కృషి చేస్తానని చెప్పారు.


TEJA NEWS