TEJA NEWS

నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్మించిన బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని వెంటనే కూల్చేయాలంటూ మున్సిపల్‌ కమిషనర్‌ను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ఆదేశించారు. ఈ బీఆర్ఎస్ కార్యాలయ కూల్చివేతపై ఇప్పటికే ఓసారి అధికారులకు ఆదేశాలు ఇచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఇప్పుడు మరోసారి ఆదేశించారు. శనివారం రోజున నల్గొండ జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అనంతరం కమిషనర్, అడిషనల్‌ కలెక్టర్‌ను పిలిపించుకుని.. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేతలపై ఆదేశాలు జారీ చేశారు.బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌కు ఇవాళ వ్యక్తిగతంగా నోటీసులు అందజేయాలని.. తాను అమెరికా వెళ్లి వచ్చేలోపు పార్టీ కార్యాలయాన్ని నేలమట్టం చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. ఈ నెల 11వ తేదీలోగా పార్టీ ఆఫీసును కూల్చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు. లేకపోతే.. కమిషనర్‌పై కేసు పెట్టి ఎందుకు కూల్చడం లేదో విచారించి జైలుకు పంపించాలని అడిషనల్‌ కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. కమిషనర్ ఈ విషయంలో స్పందించకపోతే.. దగ్గరుండి బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని కూల్చే విధంగా బాధ్యత తీసుకోవాలని మున్సిపల్ ఛైర్మన్‌ బుర్రి శ్రీనివాస్ రెడ్డిని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశారు.


బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ భూమిని అక్రమంగా అక్రమించుకున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ రేకులను విప్పి.. ఆ పార్టీ అధ్యక్షుడి ఇంటి దగ్గర పెట్టేయ్యాలని సూచించారు. ఆ తర్వాత పార్టీ భవనాన్ని నేలమట్టం చేసేయ్యాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. కార్యాలయం స్థలంలో.. సమీప కాలనీలకు మంచినీటి సరఫరా చేసేందుకుగానూ.. 20 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణానికి నివేధిక సిద్ధం చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులకు మంత్రి సూచించారు. అదేవిధంగా స్త్రీ నిధి భవనం కూడా నిర్మించి.. ఆ స్థలంలో పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలే ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు.


TEJA NEWS