పేదలకు వైద్య సేవలకు ప్రాముఖ్యత :మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ : పేద రోగులను ఆదుకొనేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధిని తాము సద్వినియోగం చేసుకుంటామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన మేడిబావి ప్రాంతంలోని రాజేశ్వరి తీవ్ర అస్వస్థతకు గురై, సితఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయాన్ని సహాయానికై ఆశ్రయించారు. వెంటనే స్పందించిన శాసనసభ్యులు పద్మారావు గౌడ్ ఆమెకు రూ.రెండు లక్షల విలువజేసె ఎల్.ఓ.సి. పత్రాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సమకూర్చి సోమవారం తన కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలకు వైద్య సేవలను అందించడంలో తాము అగ్ర స్థానంలో నిలుస్తామని అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రజల సమస్యల పరిష్కారానికి సితాఫలమండిలోని తమ క్యాంపు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.
