ఘనంగా ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతున్న టేకుమట్ల చౌడమ్మ తల్లి జాతర

TEJA NEWS

ఘనంగా ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతున్న టేకుమట్ల చౌడమ్మ తల్లి జాతర

సూర్యాపేట జిల్లా ప్రతినిధి

సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల గ్రామంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే శ్రీశ్రీశ్రీ చౌడమ్మ తల్లి – లింగమంతుల స్వామి జాతర ఘనంగా ప్రారంభమై విజయవంతంగా కొనసాగుతోంది. గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతూ, భక్తుల జయజయధ్వానాలతో దేవస్థానం పరిసరాలు మార్మోగుతున్నాయి. యాదవుల కులదైవంగా భావించే చౌడమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, బోనాలు, నైవేద్యాలు సమర్పిస్తూ భక్తులు తమ భక్తిని చాటుకుంటున్నారు. మందగంపల ఊరేగింపులు, సంప్రదాయ డప్పు వాయిద్యాలు, డీజే శబ్దాల మధ్య జాతర ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. ఈ జాతర ఆధ్యాత్మికత, సంప్రదాయం, సంస్కృతి సమ్మేళనంగా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. విద్యార్థుల సెలవులను దృష్టిలో ఉంచుకుని ఈ జాతరను ముఖ్యంగా ఆదివారం, సోమవారం, మంగళవారం రోజులలో ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఈ మూడు రోజుల పాటు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటి వరకు జాతర విజయవంతంగా కొనసాగుతూ భక్తుల విశేష ఆదరణ పొందుతోంది. టేకుమట్ల గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుండి వచ్చిన యాదవ సోదరులు భారీ సంఖ్యలో పాల్గొని జాతరను మరింత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మహోత్సవాన్ని భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ, అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వట్టె జానయ్య యాదవ్, ఎడ్ల వీరమల్లు యాదవ్ తదితర యాదవ సోదరులు పాల్గొని జాతర నిర్వహణకు తమ వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా గ్రామంలో భక్తిశ్రద్ధలు ఉప్పొంగుతూ, ఆధ్యాత్మిక ఆనందంతో నిండిన వాతావరణం నెలకొంది. చౌడమ్మ తల్లి కటాక్షంతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు.

You cannot copy content of this page

Scroll to Top