
గోదావరిఖని నుంచి కాకినాడకు నేరుగా ప్రయాణం, ప్రజలకు కొత్త వరం…!
గోదావరిఖని–కాకినాడ నూతన ఆర్టీసీ బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్….
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, ప్రజల రవాణా సౌకర్యాలను మరింత మెరుగుపర్చే దిశగా గోదావరిఖని నుండి కాకినాడకు నూతన ఆర్టీసీ బస్సు సేవను బుధవారం రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. బస్సుకు ప్రత్యేక పూజలు నిర్వహించి, జెండా ఊపి ఆయన సేవలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ గోదావరిఖని, పరిసర ప్రాంతాల ప్రజలకు కాకినాడకు ప్రయాణించేందుకు ఈ కొత్త బస్సు సేవ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సర్వీసును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ బస్సు సేవ ప్రారంభం ద్వారా రెండు ప్రాంతాల మధ్య ప్రయాణం మరింత సులభతరం కానుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. నూతన బస్సు సేవ ప్రారంభం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.