
కార్మిక హక్కుల పరిరక్షణకు సమరశీల పోరాటాలు
ఏఐటీయూసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి….
కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో తరలిరావాలి…
–కడారి సునీల్….
పెద్దపల్లి జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/
కార్మిక హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ పిలుపునిచ్చారు. సుల్తానాబాద్లో ఆగస్టు 20న నిర్వహించనున్న ఏఐటీయూసీ నాలుగో జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ బుధవారం ఎన్టీపీసీ నంబర్-2 గేట్ వద్ద ఏఐటీయూసీ నాయకులు కరపత్రాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా కడారి సునీల్తో పాటు రామగుండం ఏరియా ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శులు రెడ్డపాక లక్ష్మణ్, నాంసాని శంకర్ మాట్లాడుతూ జిల్లా మహాసభలో కార్మిక చట్టాలు, హక్కుల పరిరక్షణతో పాటు కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్ పోరాట కార్యాచరణను రూపొందించనున్నట్లు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు, పోరాటాలు చేపట్టేందుకు మహాసభలో నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్మికులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో మహాసభకు హాజరై జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు సత్యనారాయణ, అర్జున్, నారాయణరెడ్డి, రవి, వేణు, శ్రీనివాస్, సదానందం, శ్యామ్చారి, మల్లేష్, వెంకన్న, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.