
న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని హైకోర్టు న్యాయవాదులు డిమాండ్ చేశారు.
వామనరావు దంపతుల హత్య దగ్గరి నుంచి లాయర్లపై అనేక దాడులు,హత్యలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంపాపేటలో దారుణ హత్యకు గురైన న్యాయవాది ఎర్రబాపు ఇజ్రాయెల్ హత్యకు నిరసనగా మంగళవారం హైకోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు.
అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేచ్చే వరకు పోరాటాలు సాగిస్తామని పేర్కొన్నారు.
నిరసనలో హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్రెడ్డి,న్యాయవాదులు పాల్గొన్నారు.
న్యాయవాది హత్య ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ నర్సింహారెడ్డి, కౌన్సిల్ సభ్యులు పేర్కొన్నారు.
అడ్వొకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకురావడం ద్వారా దాడులను అరికట్టాలని టీపీసీసీ లీగల్ సెల్ ఛైర్మన్ పొన్నం అశోక్గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కాగా, న్యాయవాదుల రక్షణకు అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాదులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు.
నాంపల్లి క్రిమినల్ కోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించి అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు.
పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు.
