TEJA NEWS

మైసూరు రాజమాతచే తిరుమల శ్రీవారికి అఖండాలు

** 300 సంవత్సరాలు తర్వాత విరాళాన్ని అందించిన మైసూరు రాజవంశీకులు

తిరుపతి: తిరుమల శ్రీవారికి మైసూరు రాజమాత శ్రీ ప్రమోదా దేవి రెండు భారీ వెండి అఖండాల(అఖండ దీపాలు)ను సోమవారం విరాళంగా అందించారు.
ఈ అఖండాలు తిరుమల గర్భగుడిలో వెలిగించే సంప్రదాయ దీపాలు. సుమారు 300 సంవత్సరాల క్రితం అప్పటి మైసూరు మహారాజు ఇలాంటి దీపాలను ఆలయానికి విరాళంగా అందించినట్లు చరిత్రలో ఉంది. ఇప్పుడు మళ్లీ మైసూరు రాజమాత వాటిని సమర్పించడం విశేషం. ఒక్కో వెండి అఖండం సుమారు 50 కిలోల బరువుంటుంది. తిరుమలలోని రంగనాయకుల మండపంలో ఆమె ఈ భారీ వెండి అఖండాలను అందించారు.
టీటీడీ ఛైర్మన్ బొల్లినేని రాజగోపాల్ (బి.ఆర్.) నాయుడు, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.