
ఎల్ఆర్ఎస్ ఎవరూ కట్టొద్దు
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులెవరూ రుసుములు చెల్లించవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు పిలుపునిచ్చారు. ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు 25 శాతం రాయితీ అంటూ రుసుములు వసూలు చేయడం సిగ్గుచేటన్నారు. చారణా రిబేట్ ఇచ్చిన కాంగ్రె్సకు.. రేపు ఎన్నికల్లో ఓటర్లు బారణా రిబేట్ ఇస్తారని చెప్పారు. బీఆర్ఎ్సఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మహబూబ్నగర్ స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డితో రూ.90 కోట్లు ఖర్చు పెట్టించారని, ఓట్లు కొనుగోలు చేసే క్రమంలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు రూ.5-10 లక్షల వరకు ఇచ్చారని ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి బట్టబయలు చేశారని చెప్పారు. ఈడీ, సీబీఐ, ఐటీ, ఈసీ ఈ విషయంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సుమోటోగా తీసుకొని కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. చిన్నారెడ్డి వనపర్తిలో ఆవేదనతో చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశత్వానికి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్న విధానానికి అద్దం పడుతున్నాయని హరీశ్ అన్నారు. ఇందిరమ్మ రాజ్యం పోలీసు రాజ్యమైందని, తమ పార్టీ కార్యకర్తల నుంచి నాయకుల దాకా అక్రమ కేసులు, వేధింపులు సర్వసాధారణమైపోయాయని ఆరోపించారు.
ఫోన్లు చేసి వెంట పడుతున్నారు..
బీఆర్ఎస్ హయాంలో ఎల్ఆర్ఎ్సకు దరఖాస్తులు ఆహ్వానిస్తే.. పేద ప్రజల రక్తం తాగే పథకం అంటూ భట్టి విక్రమార్క, ఉత్తమ్, సీతక్క, కోదండరాం నానా యాగీ చేశారని హరీశ్ గుర్తుచేశారు. తాము అధికారంలోకి వస్తే ఉచితంగా క్రమబద్ధీకరిస్తామని చెప్పారన్నారు. ఇప్పుడేమో ఫీజులు పెంచి, అధికారులు దరఖాస్తుదారులకు ఫోన్లు చేసి మరీ ఎల్ఆర్ఎస్ రుసుము కట్టాలని వెంటపడుతున్నారన్నారు. ఉచితంగా చేస్తామన్నారని.. దానిపై కోదండరాం ఇప్పుడెందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ఎన్నికల ముందు అంతా ఉచితం అన్నారని.. ఇప్పుడు 25 శాతం డిస్కౌంట్ అని జేబులు ఖాళీ చేసే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టవద్దని దరఖాస్తుదారులకు పిలుపునిచ్చారు.
