
విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి…
పికె రామయ్య కాలనీ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన డిప్యూటీ మేయర్…
పెద్దపల్లి-జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని 1వ డివిజన్ పి.కె. రామయ్య కాలనీ ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, 1వ డివిజన్ కార్పొరేటర్ మడిపెల్లి విజయ్ మల్లేష్ పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసిన వారు, మధ్యాహ్న భోజనం రుచి, శుచి, నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ప్రతిరోజూ పరిశుభ్రమైన, నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించాలని వంట ఏజెన్సీ నిర్వాహకులకు, పాఠశాల ఉపాధ్యాయులకు డిప్యూటీ మేయర్ సూచించారు.
పేద విద్యార్థుల విద్య, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్, 1వ డివిజన్ సోషల్ మీడియా ఇన్చార్జి గుర్రాల మల్లేష్ యాదవ్, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, స్థానిక నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.