
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం సహించం…..
ప్రజలకు పారదర్శక సేవలే లక్ష్యం.. అవినీతిపై రాజీ లేదు…
– జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి జాప్యానికి తావివ్వకుండా ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా అధికారులను ఆదేశించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు జే.అరుణ శ్రీ, కొప్పుల వెంకట్ రెడ్డిలతో కలిసి జిల్లా అధికారులతో నిర్వహించిన పరిపాలనా సమీక్ష సమావేశంలో కలెక్టర్ పలు కీలక సూచనలు చేశారు.
ప్రజావాణి ద్వారా అందిన ఫిర్యాదులు, వినతిపత్రాల పరిష్కారంపై అన్ని శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకూడదని, ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులో పరిష్కరించి తప్పనిసరిగా సమాధానం అందించాలని ఆదేశించారు.
ప్రతి అధికారిలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని, ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వచ్చే దరఖాస్తులకు కూడా నిర్ణీత సమయంలో సమాధానాలు అందించాలని సూచించారు.
జిల్లా పరిపాలనలోని అధికారులు, సిబ్బంది విధులకు సకాలంలో హాజరు కావడంతో పాటు తమ పరిధిలోని ఫీల్డ్ సిబ్బంది పనితీరుపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు క్షేత్రస్థాయిలో ప్రజలకు సమర్థవంతంగా అందేలా శాఖాధిపతులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
కొన్ని శాఖల్లో ఫైళ్ల పరిష్కారంలో అనవసర జాప్యంపై ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్న కలెక్టర్, పెండింగ్ ఫైళ్లను క్రమం తప్పకుండా సమీక్షించి ఉద్దేశపూర్వక జాప్యాలను వెంటనే నివారించాలని ఆదేశించారు.
కొంతమంది ఫీల్డ్ సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తున్నారన్న ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని, అవినీతిని ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా అధికారులు, సిబ్బంది నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సూచించారు.
అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, హానరేరియం సిబ్బందికి వేతనాల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, కార్యాలయ భవనాలతో పాటు ఆవరణ ప్రాంతాలను కూడా పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
Sa
త్వరలో నిర్వహించనున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి కార్యక్రమ సమీక్షకు అన్ని శాఖలు తమ వివరాలను నాణ్యతతో కూడిన సమాచారంగా సిద్ధం చేసి సమర్పించాలని ఆదేశించారు. నివేదికలు వాస్తవాధారితంగా, సమగ్రంగా ఉండాలని తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజేశ్వరి, ఆర్డీవోలు గంగయ్య, సురేష్, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.