
భక్తిశ్రద్ధలతో నల్ల పోచమ్మకు బోనాలు సమర్పించిన మగ్గిడి వంశస్థులు…
గ్రామ ప్రజల సుఖసంతోషాలు, సమృద్ధిగా వర్షాలు, పంటలు పండాలని ప్రత్యేక పూజలు…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: అంతర్గాం మండలం మోర్మూర్ గ్రామంలో మగ్గిడి వంశస్థులు తమ వంశపారంపర్య ఆరాధ్యదైవమైన నల్ల పోచమ్మ తల్లికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తాతలు, ముత్తాతల కాలం నుంచి ఆనవాయితీగా నల్ల పోచమ్మ తల్లిని ఆరాధిస్తూ వస్తున్నామని మగ్గిడి వంశస్థులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులు వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు.
అలాగే తమ వంశస్థులకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సకల శుభాలు ప్రసాదించాలని నల్ల పోచమ్మతో పాటు ఎల్లమ్మ, పోత లింగన్న, భీమన్న దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మోర్మూర్ గ్రామ సర్పంచ్ మగ్గిడి స్వరూప–శ్రీనివాస్, మగ్గిడి వంశస్థులు, వారి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
