
విద్యార్థుల భద్రతలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం – పెద్దపల్లి షీ టీమ్ అవగాహన సదస్సు…..
పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పెద్దపల్లి రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి షీ టీమ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లో నిర్వహించిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో షీ టీమ్ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీమ్ సభ్యురాలు స్నేహలత మాట్లాడుతూ, విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని, వారి సమస్యలను గుర్తించి తగిన సమయంలో స్పందించాలని సూచించారు. అలాగే పోక్సో చట్టం, పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం, మహిళల భద్రత, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, యాంటీ డ్రగ్స్ అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు.
మహిళలు, విద్యార్థినుల భద్రత కోసం షీ టీమ్ ప్రతిరోజూ బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు, జనసమ్మర్ద ప్రాంతాలు, కళాశాలల వద్ద నిరంతరం పర్యవేక్షణ నిర్వహిస్తోందని తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా 6303923700 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
అలాగే అధిక లాభాల ఆశతో సైబర్ మోసాలు, లోన్ యాప్ల బారిన పడవద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా ఆన్లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. మహిళలు ప్రమాదంలో ఉన్నా, బెదిరింపులకు గురైనా వెంటనే 100/112 అత్యవసర సేవలకు కాల్ చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జగదీశ్వర్, ఉపాధ్యాయులు, షీ టీమ్ సభ్యులు సురేష్ తదితరులు పాల్గొన్నారు.