
అరకు కాఫీకి అరుదైన గౌరవం
పార్లమెంట్ లో అరకు కాఫీ స్టాల్ కు అనుమతి
పార్లమెంట్లో అరకు కాఫీకి ప్రత్యేక స్థానం కల్పించేందుకు అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు కోసం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, స్పీకర్ ఓం బిర్లాను కలిసి అరకు కాఫీ ప్రాముఖ్యతను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ఉత్పత్తుల్లో అరకు కాఫీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, ఈ విషయాన్ని ప్రధాని మోదీ సైతం మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించినట్లు రామ్మోహన్నాయుడు స్పీకర్ కు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల గిరిజన ప్రాంతమైన అరకు వ్యాలీ ఈ కాఫీ పంటకు ప్రసిద్ది చెందింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు అరకు కాఫీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అనుమతించాలని ఏపీకి చెందిన పార్లమెంటు సభ్యులు లోక్సభ స్పీకరును కోరారు. ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు అరకు కాఫీ ప్రచార కార్యక్రమం నిర్వహణకు అనుమతిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. పర్మినెంట్ స్టాల్ ఏర్పాటు విషయాన్ని పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
