
దళితుల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం – ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఘన నివాళి…
పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, దళితులు, అణగారిన వర్గాల సామాజిక, రాజకీయ అభ్యున్నతికి భారత మాజీ ఉప ప్రధానమంత్రి స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ అన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ 40వ వర్ధంతి సందర్భంగా గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, రాష్ట్ర కార్యదర్శి ఇరుగురాల కృష్ణయ్య, జిల్లా కో-కన్వీనర్ ఆకునూరి బాల అంకుష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొంకటి లక్ష్మణ్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన మార్గంలో బాబు జగ్జీవన్ రామ్ దళితుల హక్కుల పరిరక్షణ, రిజర్వేషన్ల అమలు, సామాజిక న్యాయం కోసం విశేషంగా కృషి చేశారని అన్నారు. కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా దాదాపు నాలుగు దశాబ్దాల పాటు దేశానికి సేవలందించిన గొప్ప నాయకుడని కొనియాడారు.
దేశ ప్రధానమంత్రి అయ్యే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ, కుల వివక్ష కారణంగానే బాబు జగ్జీవన్ రామ్ ఆ అవకాశాన్ని కోల్పోయారని ఆయన పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పెద్దపల్లి జిల్లా కో-కన్వీనర్ గద్దల శశిభూషణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకుడు బొచ్చు శంకర్, ఏఐటీయూసీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు ఎం.ఏ. కరీం, డీఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షుడు కనకం గణేష్, జిల్లా నాయకులు బూడిద సమ్మయ్య, ఆకునూరి రాజయ్య, మడిపల్లి శ్రీనివాస్, పుల్లూరి మహేందర్, ఇందారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొని బాబు జగ్జీవన్ రామ్కు ఘన నివాళులర్పించారు.
