
6నుంచి అప్పలాయ గుంటలో బ్రహ్మోత్సవాలు
** 11న గరుడ సేవకు ఏర్పాట్లు
తిరుపతి: టీటీడీకి అనుబంధంగా… తిరుపతి నుంచి 20కి.మీల దూరంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 06 నుంచి 15వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇందుకోసం 03వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 06వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహిస్తారు.
వాహనసేవల వివరాలు
07 ఉదయం ధ్వజా రోహణం, రాత్రికి పెద్దశేష వాహనం, 08న ఉదయం చిన్నశేష వాహనం, రాత్రికి హంస వాహనం, 09న ఉదయం సింహ వాహనం, రాత్రికి ముత్యపుపందిరి వాహనం,10న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవం అనంతరం సర్వభూపాల వాహనం,11న ఉదయం మోహినీ అవతారం, రాత్రికి గరుడ వాహనం, 12న ఉదయం హనుమంత వాహనం, రాత్రికి గజ వాహనం,13న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం,14న ఉదయం రథోత్సవం, రాత్రికి అశ్వవాహనం, 15న చక్రస్నానం, సాయంత్రం ధ్వజావరోహణం జరగనున్నాయి.
ఆలయ విశిష్టత:
సుమారు వేయి ఏళ్లుకు పైగా చారిత్రక ప్రసిద్ధి ఉన్న కార్వేటినగర ప్రభువుల పాలనలో శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామి అప్పలాయగుంట ఆలయం ఉండినట్లు, తిరుమల, తిరుపతి, తిరుచానూరు ఆలయ ఉత్సవాలు, ఊరేగింపుల తరహాలో అప్పలాయగుంట ఆలయమునందు కూడా కార్వేటినగర ప్రభువులు ప్రధానపాత్ర పోషించి ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించినట్లు శాసనాధారాలు తెలియజేస్తున్నాయి.
స్థల పురాణం:
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నారాయణవనంలో ఆకాశరాజు కుమార్తె శ్రీ పద్మావతీ దేవిని వివాహం చేసుకుని తిరుమలలోని వకుళామాత ఆశ్రమానికి వెళుతూ మార్గమధ్యంలో శ్రీ సిద్దేశ్వర స్వామి వారి తపస్సును మెచ్చి, ఆయన కోరిక మేరకు ప్రసన్నుడై అక్కడ అభయ హస్తముతో వెలసినట్లు తెలియుచున్నది. ఈ ఆలయం తూర్పు ముఖముగా నిర్మింపబడి, గర్భాలయం నందు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి మూలమూర్తి చతుర్బుజుడై శంఖుచక్రాలు ధరించి, కటిహస్తం మరియు అభయహస్త ముద్రతో ప్రసన్నుడై ఉంటూ శ్రీదేవి, భూదేవి, చక్రత్తాళ్వారు, విష్వక్సేనులు, బాష్యకారుల ఉత్సవ విగ్రహాలు కలిగియున్నారు. గర్భాలయానికి నైరుతిమూలలో శ్రీపద్మావతి అమ్మవారి ఆలయము, వాయువ్యమూలలో శ్రీగోదాలక్ష్మీ అమ్మవారి ఆలయం స్వామివారికి అభిముఖముగా గరుత్మంతుల వారి విగ్రహము వెలసియున్నది. ఆలయ వెలుపలి ప్రాకారానికి ఎదురుగా సుమారు 100 గజాల దూరంలో శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి వారి ఆలయం ఉన్నది. 10వ తేదీ సాయంత్రం 4.30 – 6.30 గంటల మధ్య స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు.
