
గ్రీవెన్స్ డేలో ప్రజల సమస్యలపై పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా ప్రత్యేక దృష్టి
రామగుండం,
అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల వినతిపత్రాలను స్వీకరించి వారి సమస్యలను పోలీస్ కమిషనర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అందిన ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా, పారదర్శకంగా, నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సీఐలతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదుల ప్రస్తుత స్థితిగతులను తెలుసుకుని, పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
ప్రజలు ఎలాంటి భయం, సందేహం లేకుండా మధ్యవర్తులు లేదా పైరవీల అవసరం లేకుండానే నేరుగా పోలీసు శాఖను సంప్రదించాలని పోలీస్ కమిషనర్ సూచించారు. ప్రజల సమస్యలకు చట్టపరమైన పరిష్కారం చూపడం, బాధితులకు న్యాయం చేయడం పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రజలకు మరింత చేరువగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణతో పాటు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పోలీసు సేవలను అందించడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులపై తక్షణ చర్యలు తీసుకుంటూ బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.